భారతదేశంలో కమ్యూనిస్టు పార్టీ పుట్టుక, ప్రస్థానం
సోవియట్ యూనియన్లో బోల్షివిక్ విప్లవం విజయవంతమయ్యాక అంతర్జాతీయ స్పిరిట్ విస్తృతంగా ఉన్న రోజుల్లో అందులో భాగంగా ఆరంభమైంది కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా 1920 అక్టోబర్ 17న తాష్కెంట్లో. దీని వ్యవ స్థాపనలో ఎంఎన్ రాయ్ కీలకపాత్ర పోషించారు.
ఎంఎన్ రాయ్, ఆయన సహచరి ఎవ్లిన్ ట్రెంట్ రాయ్, అబానీ ముఖర్జీ, రోసా ఫిటింగో, మహమ్మద్ ఆలీ, మొహమ్మద్ షపీఖ్, ఎంపీబీటీ ఆచార్యలు కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియాను సోవియట్ యూనియన్లోని తాష్కెంట్లో ప్రకటించారు.
ఇందులో ఎవ్లీన్ రాయ్ అమెరికన్ కమ్యూనిస్ట్, అబానీ ముఖర్జీ సహచరి అయినటువంటి రోసా రష్యన్ కమ్యూనిస్టు.
మొహమ్మద్ అలీ, మొహమ్మద్ షఫీఖ్ టర్కీలో ఖలీఫా పాలనను పునరుద్ధరించడానికి భారత్లో సాగుతున్న ఖిలాఫత్ ఉద్యమం తరపున రష్యా మద్దతుకోసం వెళ్లిన వారు.
ఖిలాఫత్ ఉద్యమానికి గాంధీ కూడా మద్దతునిచ్చిన దశ. టర్కీకి మద్దతుగా అక్కడి బ్రిటిష్ వలసపాలనకు వ్యతిరేకంగా భారత్ నుంచి అనేకమంది ఉద్యమకారులు రోడ్డు మార్గాన మరీ ముఖ్యంగా కొందరు కాలినడకన సిల్క్ రూట్లో టర్కీ వెళ్లిన దశ. కమ్యూనిస్టు ఇంటర్నేషనల్ సెకండ్ కాన్ఫరెన్స్ తర్వాత జరిగిన పరిణామమిది.
బ్రిటిష్ కమ్యూనిస్టు పార్టీ సొంత ప్రభుత్వాన్ని ఎదిరించి భారత స్వాతంత్ర్యోద్యమానికి మద్దతునిచ్చిన అంతర్జాతీయ భావన ప్రబలంగా ఉన్న రోజులవి. భారత కమ్యూనిస్టు ఉద్యమ పితామహుడిగా చెప్పుకునే ఎంఎన్ రాయ్ అప్పటికే అంటే 1917లోనే మెక్సికన్ కమ్యూనిస్టు పార్టీని(సోషలిస్ట్ వర్కర్స్ పార్టీ)ని ఆరంభించి ఉన్నారంటే ఆ నాటి అంతర్జాతీయత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
అప్పటికే దేశంలోని వివిధ ప్రాంతాల్లో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటంసాగిస్తున్న బృందాలను ఇది ఆకర్షించింది.
ముఖ్యంగా అమెరికా కేంద్రంగా సాగుతున్న గదర్ పార్టీ కార్యకర్తలపై ప్రభావం బలంగా ఉన్నది. అలాగే ఖిలాఫత్ ఉద్యమంలో భాగమైన ఉద్యమకారులు కమ్యూనిస్టు పెద్దఎత్తున కమ్యూనిస్టు పార్టీలోకి వచ్చారు.
వీరితో పాటు బోల్షివిక్ ప్రభావంతో కమ్యూనిస్టు భావజాలంతో వివిధ నగరాల్లో పనిచేస్తున్న చిన్నచిన్న బృందాలను కలిపే ప్రయత్నాలు ఎంఎన్ రాయ్ సాగించారు. కాకపోతే పార్టీకి నిర్దుష్టమైన కార్యక్రమం లేకపోయింది.
కాంగ్రెస్తో కలిసి కాంగ్రెస్లోనూ అంతర్భాగమై దానిని ప్రభావితం చేయడం, కలసివచ్చే వారిని కలుపుకొని పోవడం అనే పంథా అవలంబించారు. నగర పారిశ్రామిక వాడల్లో సమ్మెలను ఆయుధంగా మల్చుకున్నారు.
గయలో 1922లో జరిగిన కాంగ్రెస్ సమావేశంలోనే మద్రాస్ గ్రూప్ కమ్యూనిస్ట్ నాయకుడు సింగారవేలు చెట్టియార్ సంపూర్ణ స్వరాజ్ నినాదమిచ్చి కలకలం సృష్టించారు.
ఆంక్షలు, కుట్ర కేసులు
ఆంక్షలు కుట్ర కేసులు అంటే చాలామందికి ఇపుడు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ గుర్తొస్తుంది. కానీ బ్రిటిష్ వారి హయాంలో కమ్యూనిస్టులపై అంతకంటే తీవ్రమైన ఆంక్షలు నిషేధాలు సాగాయి.
కమ్యూనిస్టు కార్యకర్తలపై అనేక కుట్రకేసులు పెట్టారు. పెషావర్ కుట్రకేసులు, కాన్పూర్ కుట్రకేసు, మీరట్ కుట్ర కేసు ప్రధానమైనవి. ముఖ్యంగా కాన్పూర్ కుట్రకేసులో అగ్రనాయకత్వాన్ని అంతా ఇరికించారు.
ఎంఎన్ రాయ్ దేశంలోని కమ్యూనిస్టులతో జరిపిన ఉత్తరప్రత్యుత్తరాలన్నీ బ్రిటిష్ ప్రభుత్వం ట్రాక్ చేసిందని అందరికీ అర్థమైంది.
కరస్పాండెన్స్ ట్రాక్ చేయడం, వాటి ఆధారంగా కుట్ర కేసులు అలా మొదలయ్యాయి. ఒకరకంగా నేటి భారత ప్రభుత్వాలు బ్రిటిష్ చట్టాలనే కాకుండా వారి ట్రాకింగ్ పద్ధతులను కూడా ఇపుడు వారసత్వంగా తీసుకున్నాయమని చెప్పొచ్చు.
కాన్పూర్ కాన్ఫరెన్స్-సీపీఐ ఏర్పాటు
కాన్పూర్ కుట్రకేసులో నాయకులు జైలునుంచి బయటకొచ్చాక అక్కడే 1925 డిసెంబరులో నాయకులంతా కలిసి సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. అంతకుముందు తాష్కెంట్లో ఏర్పాటైన పార్టీ నిర్మాణం, నిర్వహణల్లో ఒడిదుడుకుల రీత్యా పూర్తిస్థాయి దేశవ్యాప్త కమ్యూనిస్టు నిర్మాణం ఏర్పాటుచేయాలని నిర్ణయించి జాతీయస్థాయిలో కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా ఏర్పాటైనట్టు ప్రకటించారు.
సింగావేలు చెట్టియార్ అధ్యక్షుడిగా, ఘాటే కార్యదర్శిగా పార్టీ ఏర్పాటైంది. అయితే సీపీఎం, కొన్ని ఎంఎల్ పార్టీలు భారత కమ్యూనిస్టు ఉద్యమం తాష్కెంట్లో ఏర్పాటైన కమ్యూనిస్టు పార్టీతో ఆరంభమైందని గుర్తిస్తే నేటి సీపీఐ మాత్రం కాన్పూర్లో 1925లో ఏర్పాటైన పార్టీనే ఆరంభం అని చెపుతూ వస్తున్నది. ఆరంభానికి సంబంధించి నేటికీ కొనసాగుతున్న భిన్నాభిప్రాయం ఇది.
పార్టీ సొంతంగా పనిచేసే వాతావరణం లేకపోవడం వల్ల దేశంలోని వివిధ ప్రాంతాల్లో కమ్యూనిస్టుల నేతలు పీసాంట్స్ అండ్ వర్కర్స్ పార్టీలను ఆరంభించారు. ప్రభుత్వం ఎక్కడికక్కడ అరెస్టులు సాగించింది.
అదే సమయంలో భగత్ సింగ్ వంటి విప్లవకారులు కమ్యూనిజం చేత ప్రభావితులయ్యారు. చిట్టగాంగ్లో స్థానిక కమ్యూనిస్టులు జరిపిన పోరు చారిత్రాత్మకంగా నిలచిపోయింది.
హైదర్ ఖాన్ శిష్యుడైన పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరరావు, ఈఎంఎస్ నంబూద్రిపాద్, ఏకే గోపాలన్, బీటీ రణదివె వంటి కొత్త తరం నాయకత్వంలోకి వస్తూ ఉన్నది.
మీరట్ కుట్రకేసు నుంచి నాయకులు విడుదలయ్యాక 1934లో నాయకులంతా కలకత్తాలో సమావేశమై దేశవ్యాప్త ఉద్యమానికి జాతీయవ్యాప్త పార్టీ నిర్మాణం జరపాలని నిర్ణయించింది. పరిస్థితులను నిశితంగా గమనిస్తూ ఉన్న బ్రిటిష్ పాలకులు 1934లో పార్టీని నిషేధించారు.
నిషేధం తర్వాత అదే సంవత్సరంలో జయప్రకాశ్ నారాయణ్ నేతృత్వంలో కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ ఏర్పాటైంది.
అది కాంగ్రెస్కు అనుబంధంగా ఉన్న సోషలిస్టుల బృందంగా పనిచేసేది. ముఖ్యంగా దక్షిణాదిన అది పూర్తిగా కమ్యూనిస్టుల ఆధిపత్యంలో ఉండింది. కాంగ్రెస్లో భాగంగా ఉండి సోషలిస్ట్ ఉద్యమానికి అనుకూలంగా పనిచేయడమే వ్యూహాన్ని ఎంచుకున్నారు. కాంగ్రెస్తో కలిసి పనిచేయడం కాంగ్రెస్లో అంతర్భాగంగా ఉండి పనిచేయడం రెండూ చేస్తూ వచ్చారు.
అయితే కమ్యూనిస్టుల వైఖరి పట్ల సదభిప్రాయం లేని జయప్రకాశ్ నారాయణ్ ఆయన అనుచరులు 1940 రామ్ఘర్ కాంగ్రెస్లో కమ్యూనిస్టు శక్తులను బయటకు పంపించేశారు. పరస్పరం అనుమానాలతోనే అప్పటివరకూ వారి ప్రయాణం సాగింది.
కాంగ్రెస్అధినాయకత్వంతోనూ సంబంధాలు అదే రీతిలో ఉన్నాయి. 1936లో ఏర్పాటైన ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్-ఏఐఎస్ఎఫ్ తొలికాన్ఫరెన్స్ను పండిట్ నెహ్రూ ఆరంభించారు.
తర్వాత ఆయనకూ కమ్యూనిస్టులకు సంబంధాలు దెబ్బతిన్నాయి. ఒక్క విద్యార్థి సంఘమే కాదు, మహిళా సంఘం, రాడికల్ యూత్ సంఘాలు, ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్ లాంటి సంఘాలన్నీ ఆ కాలంలోనే ఏర్పాటయ్యాయి.
ఇప్టా-ప్రజానాట్యమండలి
1943లో ఏర్పాటైన ఇప్టా అత్యంత కీలకమైన సంఘంగా అత్యంత ప్రభావశీలమైనసంఘంగా చరిత్ర కెక్కింది.
ముల్క్రాజ్ ఆనంద్, కైఫీ ఆజ్మీ , పృథ్విరాజ్ కపూర్, బలరాజ్ సహానీ, రిత్విక్ ఘటక్, ఉత్పల్ దత్, సలీల్ చౌదరి లాంటి ఎందరో స్టాల్వార్ట్స్ సాహిత్య సాంస్కృతిక రంగాన్ని ప్రభావితం చేశారు. తొలిదశ సినిమాల పైనా వీరి ప్రభావం బలంగా ఉంది.
తెలుగులో అదే సంస్థ ప్రజానాట్యమండలిగా ఏర్పాటైంది. గరికపాటి రాజారావు, జగ్గయ్య, అల్లురామలింగయ్య, నాగభూషణం, జి వరలక్షి, కాకరాల, తిలక్, మిక్కిలినేని, తాతినేని ప్రకాశరావు, బొల్లిముంత శివరామ కృష్ణ, తమ్మారెడ్డి కృష్ణమూర్తి. వంటి ఎంతో మంది సినిమా బాట పట్టారు,.తమదైన ముద్ర వేశారు.
గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి ఎంతో మంది వారిబాట పట్టారు. సంపన్నవంతమైన కోస్తా ప్రాంతం కావడం వల్ల వ్యవసాయ కులాలనుంచి వచ్చినవారు ఎక్కువగా ఉన్నారు. తర్వాత అదిపూర్తిగా కమర్షియల్ బాటగా మారిపోయింది కానీ తొలిదశలో ప్రజానాట్యమండలి ముద్ర ప్రబలంగా కనిపించేది.
అలాగే అప్పట్లో గుంటూరులో అత్యంత క్రూరమైన అణచివేతకు పేరుమోసిన ఎస్పి పళనియప్పన్ బారినుంచి ప్రాణాలు కాపాడుకోవడానికి కూడా పలువురు మద్రాస్ బాట పట్టారని ఆ నాటి కమ్యూనిస్టు ఉద్యమంలో ప్రజానాట్యమండలి ప్రదర్శనల్లో పాల్గొన్న నంబూరి పరిపూర్ణ గారు తన ఆత్మకథ వెలుగుదారులలో పేర్కొన్నారు.
ఎలమర్రు కాటూరుల్లో జరిగిన ఘటనలు అప్పటి పోలీసుల క్రూరత్వం ఆనాటి చరిత్రను చెపుతాయి.
అంటే ప్రజానాట్యమండలి కళాకారులు సినిమా బాట పట్టడానికి అనేకానేక కారణాలు పనిచేశాయని అర్థం అవుతుంది. తెలుగు గడ్డ నుంచి జాతీయ దృశ్యానికే వస్తే ఇప్టా ఉద్యమం అనేక స్టాల్ వాల్ట్స్ని తయారుచేసింది.
హిందీనాటక సినిమా రంగాలపై బలమైన ముద్ర వేసింది. పృథ్విరాజ్ కపూర్, బలరాజ్ సహానీ, రిత్విక్ ఘటక్, ఉత్పల్ దత్, సలీల్ చౌదరి లాంటి ఎందరో స్టాల్ వార్ట్స్ సాహిత్య సాంస్కృతిక రంగాన్ని ప్రభావితం చేశారు.
మహాత్మా గాంధీలోని కొన్ని అంశాలతో తీవ్రంగా ప్రభావితులైన పుచ్చలపుల్లి సుందరయ్య, నంబూద్రిపాద్ దక్షిణాదిన దళితుల దేవాలయ ప్రవేశం, రైతకూలీల హక్కుల వంటిరంగాల్లో విశేషంగా పనిచేసిన కాలమిది. వారిద్దరి వ్యవహారశైలిలో గాంధీ ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది.
1942లో గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపునిచ్చింది. కానీ కమ్యూనిస్టులు మరో రకంగా ఆలోచించారు. అపుడు తీసుకున్న తప్పుడు నిర్ణయం కమ్యూనిస్టులను ఇప్పటికీ వెంటాడుతోంది.దాని వల్ల పార్టీ ఒంటరైందని పార్టీ అధికార పత్రాల్లో కూడా పేర్కొన్నారు.
అది రెండో ప్రపంచయుద్ధ కాలం. అప్పటికే నాజీ సేనలు రష్యాను లక్ష్యంగా చేసుకున్నాయి. దీంతో అప్పటికి రష్యా పట్టు బలంగాఉన్న భారత కమ్యూనిస్టు పార్టీపై ఆ ప్రభావం పడింది.
కమ్యూనిస్టు పార్టీ ప్రపంచ యుద్ధాన్ని ప్రజాయుద్ధంగా అభివర్ణించింది. అపుడు జర్మనీ, ఇటలీ, జపాన్ ఒకవైపు ఉంటే రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా మిత్రదేశాల కూటమిగా ఉన్నాయి.
అంటే సోవియట్కు బ్రిటన్ మిత్రదేశంగా ఉండింది. ఈ టైంలో బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా క్విట్ ఇండియా ఉద్యమం నిర్వహించడం నాజీ సైన్యాలను ఓడించే ఉమ్మడి ప్రయత్నాలను దెబ్బతీస్తుంది అని విశ్లేషిస్తూ కమ్యూనిస్టు పార్టీ ఆప్ ఇండియా ఆ రోజు క్విట్ ఇండియా ఉద్యమాన్ని వ్యతిరేకించింది.
నాజీ సేనల పురోగతిని అడ్డుకోవడానికి జాతీయ ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కూడా బ్రిటిష్ ప్రభుత్వాన్ని కోరింది. బ్రిటిష్ వాళ్ల మెడలు వంచడానికి ఇదే సరైన సమయం అని గాంధీ అనుకున్నారు.
కమ్యూనిస్టు పార్టీ మాత్రం సోవియట్ లైన్ తీసుకుని ఉద్యమాన్ని వ్యతిరేకించింది. జపాన్ సేనలు బర్మా వరకు వచ్చాయి కాబట్టి వారు రాకుండా అడ్డుకునే ప్రయత్నాలను ఈ ఉద్యమం దెబ్బతీస్తుంది అని ఏవో సమర్థనలు చేసుకున్నది కానీ అది జనానికి రుచించలేదు.
అప్పటివరకూ స్వాతంత్ర్యోద్యమంలో కాంగ్రెస్తో కలిసి వివిధ రూపాల్లో పాల్గొన్నప్పటికీ స్వాతంత్ర్యోద్యమంలో అత్యంత కీలకమైనదిగా భావించే ఈ ఉద్యమాన్ని వ్యతిరేకించి వ్యూహాత్మకమైన తప్పిదానికి పాల్పడిందని పార్టీ నాయకులు కూడా అంగీకరిస్తారు.
స్వాతంత్ర్య పోరాటంలో కమ్యూనిస్టులు విస్తృతంగా పాల్గొని జైలుశిక్షలు అనుభవించినా ఈ తప్పిదం మాత్రం కారు మబ్బులా కమ్మేసింది.
ఏమైతేనేం, ఆ తర్వాత అదే ఏడాదిలో బ్రిటిష్ ప్రభుత్వం కమ్యూనిస్టు పార్టీపై నిషేధాన్ని ఎత్తివేసింది. కాంగ్రెస్ అని పిల్చుకునే పార్టీ తొలి కాన్ఫరెన్స్ 1943లో బాంబేలో జరిగింది. అంటే పార్టీ ఏర్పడిన 23 ఏళ్ల తర్వాత గానీ తొలి కాన్ఫరెన్స్ జరుపుకోలేని స్థితి ఆనాడు ఉండింది అని అర్థం అవుతుంది.
ఆంక్షలు, నిషేధాల మధ్య వర్కర్స్ సమ్మెలు, కొన్నిచోట్ రైతాంగ ఉద్యమాలు ప్రధాన అస్ర్తంగా పార్టీ గ్రూపులు పనిచేస్తూ వచ్చాయి.
1947లో స్వాతంత్ర్యం వచ్చింది. నెహ్రూ స్వయంగా సోషలిస్ట్ అని గుర్తింపు పొందుతున్నారు, సోషలిస్ట్ పంథాలో ప్రభుత్వం నడుస్తుంది అని చెపుతున్నారు. 49లో చైనాలో మావో అధ్వర్యంలో కమ్యూనిస్టు విప్లవం విజయవంతమై అంతర్జాతీయంగా రష్యా స్థానాన్ని చైనా ఆక్రమించడం మొదలైంది.
దీనికితోడు మూడు ప్రధాన రైతాంగ ఉద్యమాలు చైనా మోడల్ వైపు ఆకర్షితులయ్యేలా చేశాయి. స్వాతంత్ర్యం ఒక డైలమా తెచ్చిపెడితే చైనా విజయం మొత్తం మార్గం ప్రోగ్రాంపైనే చిచ్చు రేపింది.
సోషలిజం లక్ష్యంగా సాగే పార్టీ కాంగ్రెస్ నేతృత్వంలో సాధించిన స్వాతంత్ర్యాన్ని ఎలా చూడాలి తొలి రోజుల్లో పెద్ద డైలమా. నెహ్రూ ప్రభుత్వాన్ని ఎలా చూడాలనేది దానికి అనుబంధమైన డైలమా.
అది స్వాతంత్ర్యం కాదని అధికారం చేతులు మారిందని తొలిరోజుల్లో కమ్యూనిస్టులు తీర్మానాలు చేశారు. అప్పటికి భారత్ సహా వివిధ దేశాల దేశాల కమ్యూనిస్టు పార్టీలు సోవియెట్ కమ్యూనిస్టు పార్టీ ప్రభావంలో ఉన్నాయి.
ఒక రకంగా ఆయాదేశాల పాలసీలను నిర్దేశించే స్థితిలో సోవియెట్ పార్టీ ఉన్నది. సోవియెట్ కమ్యూనిస్టు పార్టీ మాత్రం ప్రభుత్వం జాతీయ బూర్జువాల నేతృత్వంలో ఉంది దానిపై పోరాడకూడదు అని పార్టీకి సలహాఇచ్చింది.
అదే బాటలో నెహ్రూ స్వతంత్రంగానే వ్యవహారిస్తున్నారు, పైగా సోషలిస్ట్ పంథా తనది అని చెపుతున్నారు కాబట్టి కాంగ్రెస్లోని వామపక్ష సమూహాలతో కలిసి పనిచేసి తమ దారికి తెచ్చుకోవడం మంచిది అని ఒక వర్గం వాదిస్తే కాదూ, ఇది అర్థవలస రాజ్యం, ఇది సరైన స్వాతంత్ర్యం కాదు, చైనా బాటలో పోరాడాలి అని రెండో వర్గంవాదించింది.
రెండు శిబిరాలు ఏర్పడ్డాయి. వలసపాలకులతో పోరాడి సాధించుకున్న స్వాతంత్ర్యాన్ని ఎలా చూడాలి అనేదానిపైనా రష్యా, చైనా లైన్లపైనా రెండు శిబిరాల మధ్య విభేదాలు కొనసాగుతూ వచ్చాయి.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి