నేడు అవసరమైన ఆంటోనియో గ్రాంసీ ఆలోచనలు
నేడు అవసరమైన ఆంటోనియో గ్రాంసీ ఆలోచనలు
___బండారు రమేష్
"ఇతని మెదడు అత్యంత ప్రమాదకరమైనది. ఇతని ఆలోచనలు అత్యంత విప్లవకరమైనవి. ఈ మెదడు 20 ఏండ్ల పాటు ఆలోచించకుండా, ఇతనిని జైలులో నిర్బంధించండి” ఇది ఒక దేశ అత్యున్నత న్యాయస్థానం ఒక వ్యక్తికి శిక్ష విధిస్తూ చేసిన ప్రకటన సారాంశం. ఆ ప్రమాదకర మెదడు, ఆ విప్లవకర ఆలోచనలు ఆంటోనియో గ్రాంసీవి. భారతదేశంలో ఫాసిస్టు శక్తులు బలంగా ముందుకు వస్తున్న ప్రస్తుత తరుణంలో ఫాసిజానికి వ్యతిరేకంగా జీవితాంతం పోరాడిన గ్రాంసీని, ఆయన సైద్ధాంతిక కృషిని తెలుసుకో వాడు చాలా అవసరం.
గ్రాంసీ దక్షిణ ఇటలీలోని సార్డీనియాలో 1891 జనవరి 22న జన్మించాడు. సార్డీనియా వ్యవసాయ ఆధారిత ప్రాంతం. ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతం. గ్రాంసీ ఆ ప్రాంతంలోని రైతాంగం, వత్తిదారులు పడుతున్న కష్టాలను ప్రత్యక్షంగా చూశాడు. 1911లో ఉన్నత విద్య కోసం ఉత్తర ఇటలీలోని టురిన్ నగర విశ్వవిద్యాలయంలో చేరాడు. ఉత్తర ఇటలీ అప్పడే అభివృద్ధి చెందుతున్న పారిశ్రామిక ప్రాంతం. ఇక్కడే ఆయన వ్యవసాయాధారిత దక్షిణ ఇటలీ ప్రజలను, పెట్టుబడిదారీ ఆధారిత ఉత్తర ఇటలీ ప్రజలు తక్కువగా చూడటాన్ని గమనించాడు. ఈ తప్పుడు స్పృహను పాలకవర్గాలు సృష్టించాయని గ్రహించాడు పాలకవర్గాలు తమ భావాలను ప్రజల భావాలుగా ఎలా మారుస్తాయో తెలుసుకున్నాడు. మార్క్స్ ఏంగెల్స్ ్ లను అధ్యయనం చేయడం మొదలు పెట్టాడు. సోషలిస్టు పార్టీలో చేరి క్రియాశీలకంగా పని చేశాడు. 1917లో విజయవంతమైన రష్యా విప్లవం గ్రాంసీకి ఉత్సాహానిచ్చింది. మార్క్సిజం జడ పదార్థం కాదనే సత్యాన్ని రష్యా నిరూపించిందని, అందుకు లెనిన్ కారకుడని విశ్లేషించాడు. ఆయా దేశాల భౌతిక పరిస్థితులకు అనుగుణంగా విప్లవ వ్యూహాన్ని ఎంచుకోవడమే అసలైన మార్క్సిస్టు అవగాహన అని తెలిపాడు. 1920-22లో మాస్కోలో జరిగిన కమ్యూనిస్టు ఇంటర్నేషనల్ సమావేశాలకు గ్రాంసీ హాజరయ్యాడు లెనిన్ తో చర్చలు జరిపాడు. ఈ చర్చల నేపథ్యంలో గ్రాంసీ
తదితరులు సంస్కరణవాద సోషలిస్టు పార్టీ నుంచి బయటికి వచ్చారు. ఇటాలియన్ కమ్యూనిస్టు పార్టీని ఏర్పాటు చేశారు తర్వాత గ్రాంసీ పార్లమెంటు సభ్యుడిగా, కమ్యూనిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యాడు.
ఇదే సమయంలో ఒకప్పుడు సోషలిస్టుగా ఉన్న ముస్సోలిని విప్లవ జాతీయవాదం" పేరుతో ఒక కొత్త సిద్ధాంతాన్ని ముందుకు తెచ్చాడు. “ఇటలీ జిందాబాద్” నినాదంతో "ఫాసియో డి కంబాటిమెంట్" అనే పార్టీని స్థాపించాడు. ఈ పార్టీ పేరులోని పదం ఆధారంగానే ఫాసిజం అనే పేరు వాడుకలోకి వచ్చింది 1922లో ముస్సోలినీ ఫాసిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చింది సోషలిస్టులు, కమ్యూనిస్టుల పైన తీవ్ర నిర్బంధం విధించింది. ప్రభుత్వాన్ని కూలదోసే కుట్ర చేశాడని గ్రాంసీని 1926లో ప్రభుత్వం అరెస్టు చేసింది. 20 ఏండ్లు జైలు శిక్ష విధించింది. 11 ఏండ్ల జైలు శిక్ష అనంతరం గ్రాంసీ, 1937లో మరణించాడు. 11 ఏండ్ల జైలు జీవిత కాలంలో మనో నిర్భరాన్ని కోల్పోకుండా అనేక సైద్ధాంతిక అంశాలపైన రచనలు చేశాడు. 30కి పైగా నోట్ పుస్తకాలలో, 3 వేల పేజీలకు పైగా సైద్దాంతిక రచనలు చేశాడు. ఆ రచనలు ప్రిజన్ నోట్ బుక్స్ (జైలు రాతలు) పేరు మీద, ఆయన మరణానంతరం 6 సంపుటాలుగా ముద్రించ బడ్డాయి. గ్రాంసీ ప్రధానంగా విప్లవాన్ని సాధించే క్రమంలో వచ్చే ఆటంకాల గురించి చర్చించాడు. కార్మికవర్గం కేవలం తమ పని ప్రదేశాలలో జరిగే దోపిడీ పైన పోరాటం చేస్తే సరిపోదన్నాడు. ఇది ఆర్థిక పోరాటపు మొదటి దశ అన్నాడు. రెండవ దశలో కార్మికవర్గం సమాజంలో విభిన్న శ్రమలు చేసే శ్రామికులందరినీ కలుపుకుపోతూ మనమంతా ఒకేవర్గం అన్న భావనకు తీసుకు రావాలన్నాడు. భావజాల రంగంలో ఇందుకు అవసరమైన నైపుణ్యంతో కూడిన వర్గపోరాటాన్ని నిర్వహించాలన్నాడు. అప్పుడు మాత్రమే వర్గ పోరాటం ఆర్థిక దశ నుంచి రాజకీయ దశకు చేరుతుందన్నాడు. ఈ కార్యక్రమానికి ఆటంకంగా మారే రాజ్యం పౌర సమాజం యొక్క పాత్రను, వాటి లక్షణాలను వివరించాడు.
రాజ్యం అంటే ప్రభుత్వం, పోలీసు, మిలటరీ, చట్టాలు న్యాయస్థానాలు, జైలు.. మొదలైనవి. పౌర సమాజ వ్యవస్థలు అంటే కుటుంబం, కులం, మతం, బడి, గుడి, పండుగలు, కళలు ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు, తదితర సాంస్కృతిక భావజాల ఉత్పత్తి సాధనాలు. ఈ రెండూ వర్గ దోపిడీని సమర్థించే సాధనాలే అని గ్రాంసీ విశ్లేషిస్తాడు. రాజ్యం కేవలం పాలకవర్గపు కోట చుట్టూ ఉండే కందకం అంటాడు. కందకం లోపల శక్తివంతమైన కట్టడాలు ఉంటాయని, అవే పౌర సమాజ వ్యవస్థలంటాడు. పాలకవర్గం రాజ్య వ్యవస్థలను ఉపయోగించి బలవంతంగా తన ఆధిపత్యాన్ని (హెజిమెనీ) నిలుపుకునే ప్రయత్నం చేస్తుంది. అదే సమయంలో పౌర సమాజ వ్యవస్థలను ఉపయోగించి బలవంతం అవసరం లేకుండానే (ప్రజల మద్దతుతో) ఆధిపత్యాన్ని నిలిపి ఉంచుకుంటుందని చెపుతాడు. అందుకే కార్మికవర్గం సమాజాన్ని చేసే క్రమంలో రాజ్యం పైన, పౌర సమాజ వ్యవస్థల పైన దృష్టి పెట్టి వర్గ పోరాటం చేయాలంటాడు.
ఈ సందర్భంలోనే గ్రాంసీ మార్క్స్ ఎంగెల్స్ చెప్పిన పునాది ఉపరితల విశ్లేషణను మరింత లోతుగా వివరించాడు. పునాది ఉపరితలాల మధ్య ఉండే “గతితార్కిక ఐక్యత"ను విశ్లేషించాడు. ఈ రెండూ కలిసి ఉండే చారిత్రిక స్థితిని "హిస్టారికల్ బ్లాక్ అన్నాడు. సమాజంలో మార్పులు రావాలంటే హిస్టారికల్ బ్లాక్ లో (పునాది ఉపరితలాలలో) మార్పులు రావాలంటాడు. ఇది పాలకవర్గ ఆధిపత్యానికి (హెజిమొనీ) వ్యతిరేకంగా కార్మికవర్గం ప్రత్యాధిత్యాన్ని (కౌంటర్ హెజిమొనీ) సాధించినప్పుడు సాధ్యమవు తుందని చెపుతాడు. సమాజ మార్పుకు కార్మికవర్గ ఆధిపత్య భావజాలం కీలకమని భావించినప్పుడు, అది ఎలా సాధించ గలమో గ్రాంసీ తెలిపాడు. కార్మికవర్గ ఆధిపత్యాన్ని నెలకొల్పే సందర్భంలో మేథావుల పాత్ర కీలకమని అభిప్రాయ పడతాడు. మేథావులను సాంప్రదాయ మేధావులు, ఒకే వర్గ /సజాతి మేథావులుగా విడగొట్టాడు. సాంప్రదాయ మేథావులు దోపిడీకి మద్దతుదారులుగా ఉంటారన్నాడు. మరోవైపు సజీవ /ఒకే వర్గ మేధావులు (వీరినే ఆర్గానిక్ ఇంటెలెక్చువల్స్ అంటాం) భౌతిక వాస్తవికతకు, ఉత్పత్తి క్రమానికి దగ్గరగా ఉంటారని గ్రాంసీ తెలిపాడు. వీరే కార్మికవర్గానికి అవసరమన్నాడు. ఇలాంటి శ్రామిక వర్గపు ఆర్గానిక్ ఇంటెలెక్చువల్స్ నిరంతరం క్రియాశీలకంగా ఉంటూ శ్రామికవర్గాన్ని ప్రేరేపించేవారుగా, పోగే సేవారిగా, వర్గ పోరాట నిర్మాతలుగా ఉంటారని ఆశిస్తాడు. అయితే పెట్టుబడిదారీ వర్గం కూడా తమ వర్గపు మేథావులను సృష్టించుకుంటుందని, అందుకు నిత్యం కృషి చేస్తుందని అంటాడు గ్రాంసీ. పెట్టుబడిదారీ వర్గం తన దగ్గర పోగైన సంపదతో సులువుగా మేథావులను తయారు చేసుకోగలుగుతుందని చెపుతాడు. మరి కార్మికవర్గం తన శ్రామికవర్గపు ఆర్గానిక్ ఇంటెలెక్చువలు ఎలా తయారు చేసుకోగలుగుతుంది? దీనికి గ్రాంసీ సమాధానం చెప్పాడు ఆర్గానిక్ ఇంటెలెక్చువల్సను సృష్టించే బాధ్యతను కమ్యూనిస్టు పార్టీ తీసుకోవాలని సూచిస్తాడు. లెనిన్ చెప్పినట్టు కమ్యూనిస్టు పార్టీ “కార్మికవర్గపు అగ్రగామి దళంగా" ఉంటూ, అదే సందర్భంలో తానే స్వయంగా "సమిష్టి మేధావి" (కలెక్టివ్ ఇంటెలెక్చువల్)గా ఉండాలంటాడు. కమ్యూనిస్టు పార్టీనే స్వయంగా ఒక శ్రామికవర్గపు సమిష్టి మేధావిగా మారాలంటాడు. పార్టీ శ్రామికవర్గ ప్రజల లోకజ్ఞానాన్ని విచక్షణా జ్ఞానంగా మారుస్తూ, ఆర్గానిక్ ఇంటెలెక్చువల్స్ గా వారిని అభివృద్ధి పరచాలని కోరతాడు. అప్పుడు మాత్రమే కార్మికవర్గ ఆధిపత్యాన్ని సాధించడానికి అవసరమైన ప్రాతిపదిక ఏర్పడుతుందని గ్రాంసీ విశ్లేషించాడు. విప్లవ కార్యాచరణ వేగవంతం అవుతుందని అంటాడు.
భారతదేశంలో ఫాసిస్టు శక్తులు బలపడుతున్న ప్రస్తుత దశలో, విప్లవ శ్రేణులు గ్రాంసీని అధ్యయనం చేయడం ఎంతో అవసరం. ఎందుకంటే విప్లవ కార్యాచరణకు ఫాసిజం ఎంతటి ఆటంకమో గ్రాంసీ గ్రహించాడు. ఫాసిజం పుట్టుక, పరిణామాన్ని కండ్లారా చూశాడు. ఇటలీ పౌర సమాజంలోని అభివృద్ధి నిరోధక భావజాలాన్ని ఫాసిజం ఎలా తనకు అనుకూలంగా మార్చుకుందో గమనించాడు. సాంప్రదాయ మేథావులు పౌర సమాజ వ్యవస్థల ద్వారా శ్రామికవర్గ ప్రజల బుర్రల్లోకి ఫాసిస్టు భావజాలాన్ని ఎంత వేగంగా చేర్చారో కొలతలేశాడు. రాజకీయ సందర్భం కలిసి వచ్చినప్పుడు ఫాసిజం ఎలా రాజకీయ అధికారాన్ని తన చేతుల్లోకి తీసుకుంటుందో పరిశీలించాడు. గ్రాంసీ తానే ఒక సాక్ష్యంగా నిలబడి, ఫాసిజం ప్రజాస్వామ్యాన్ని ఎలా ఖూనీ చేస్తుందో, కమ్యూనిస్టులను ఎలా ఊచకోత కోస్తుందో వివరించాడు. అందుకే ఆయన తన జైలు రాతల్లో 250 పేజీలకు పైగా ఫాసిజం గురించే రాశాడు. దాని ప్రమాదాన్ని గుర్తించమని ప్రపంచ శ్రామికవర్గాన్ని కోరాడు. కమ్యూనిస్టు పార్టీలను హెచ్చరించాడు. అందుకే మనం ఇప్పుడు గ్రాంసీని మరింత అధ్యయనం చేయాలి. బీజేపీ ఆర్ఎస్ఎస్ అనుకూల సాంప్రదాయ మేథావులు సృష్టిస్తున్న ఫాసిస్టు భావజాలాన్ని ఎదుర్కోవాలి. దీని ప్రమాదాన్ని శ్రామికవర్గ ప్రజలకు వివరించాలి. ఇందుకు అవసరమయ్యే ఆర్గానిక్ ఇంటెలెక్చువల్స్ ను తయారు చేసుకోవాలి. వారిని అభివృద్ధి పరచాలి. ఈ మొత్తం కార్యాచరణకు అవసరమైన ఆర్థిక, సామాజిక, రాజకీయ సాంస్కృతిక వర్గ పోరాటలకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. దీనికి గ్రాంసీ సైద్ధాంతిక ఆలోచనలు మనకు ఉపయోగ పడతాయి. మన విప్లవ కార్యాచరణకు సహకరిస్తాయి.
(నవ తెలంగాణ)
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి